ఆరు గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ హక్కులు సాధించాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి తీరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిందని ఆరోపించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని… కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్… ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు… గ్యారెంటీలు అమలు చేసేది లేదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. I.N.D.I.A. కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని… కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని వ్యాఖ్యానించారు.