తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 30వ తేదీన జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు రూ.150 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కొన్ని వివరాలు…. – రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799. ఇందులో పురుష ఓటర్లు 1,62,98,418. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 – 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు దాదాపు పది లక్షల మంది ఉన్నారు. – 119 నియోజకవర్గాల్లో 2,290 మంది బరిలో ఉన్నారు. పురుషులు 2,068 కాగా మహిళలు 221 మంది. ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.- పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21,686 వీల్ చైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. బ్రెయిలీ లిపిలోను ఓటరు స్లిప్పులు.. నమూనా బ్యాలెట్లు ఉన్నాయి. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.- 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు.- పోలింగ్ కోసం 1,85,000 సిబ్బంది, 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు.- ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది.- తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.