స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను కడియం శ్రీహరికి కేసీఆర్ కేటాయించారు. ఈ నేపథ్యంలో రాజయ్య తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలు ఒకే వేదికపై ఒకరికొకరు తారసపడ్డారు. పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పునఃప్రతిష్ట కార్యక్రమంలో వీరు ఎదురుపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కూర్చున్నారు. అయితే ఏమైందో కానీ మధ్యలోనే రాజయ్య లేచి వెళ్లిపోయారు.