ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకు రెండు జాబితాల్లో 267 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఈసారి పాతవారిలో చాలామందిని పక్కనపెట్టేసి కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో 21 శాతం మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసింది. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో విజయం సాధించిన స్థానాల కంటే 67 స్థానాలు అధికంగా అంటే 370 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ప్రకటించిన 267 స్థానాల్లో 140 మంది సిట్టింగులకు మాత్రమే మళ్లీ అవకాశం కల్పించింది. 67 మందికి టికెట్ నిరాకరించింది. ఈస్ట్ ఢిల్లీ నుంచి గతంలో గెలిచిన ఎంపీ గౌతం గంభీర్‌కు ఈసారికి టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో హర్ష్ మల్హోత్రాకు సీటు ఇచ్చింది.