బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మన రెబల్‌ స్టార్‌‌కు అభిమానులు ఏర్పడ్డారు. బాహుబలి 1,2 సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు అనేక రికార్డులు, పురస్కారాలు కూడా లభించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసే మేడమ్ టుస్సాడ్స్ బ్యాంకాక్‌లోని మ్యూజియంలో  2017లో ప్రభాస్ మైనపు బొమ్మ కూడా కొలువుతీరింది. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్‌‌గా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. తాజాగా మైసూరులోని ఓ మ్యూజియంలో మరో ప్రభాస్ మైనపు బొమ్మ కనిపించింది. ఇది బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి రూపంలో ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విగ్రహం సరైన రీతిలో లేకపోవడంతో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మైసూరులోని చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ మైనపు బొమ్మపై బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డపై స్పందించాడు. తమ అనుమతి లేకుండా దీన్ని ఏర్పాటు చేశారని అన్నాడు. ‘ఇది అధికారికంగా లైసెన్స్ పొంది చేసింది కాదు. మా అనుమతి లేకుండా రూపొందించారు. దీన్ని తొలగించడానికి వెంటనే చర్యలు చేపడతాం’అని శోభు ట్వీట్ చేశాడు.