ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది . ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయరని , ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారని పార్టీ నేతలు ఓ పక్క చెబుతున్నా, మరో పక్క కొత్త ముఖ్యమంత్రి కోసం పార్టీ అంతర్గతంగా వెతుకుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ భార్య సునీత పేరు తెరపైకి రావటం విశేషం .అంతేకాదు కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మంత్రి అతిషి సహా కొందరు సీనియర్లు కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల జైలు నుంచే పాలన కొనసాగించాలన్న కేజ్రీవాల్ ఆశలు నెరవేరకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం జైలులో ఉన్న వ్యక్తి వారానికి రెండుసార్లు మాత్రమే ఇతరులతో సమావేశమయ్యే అవకాశం ఉంటుంది . ఈ రకంగా చూసినా రోజువారీ పాలన సాధ్యం కాకపోవచ్చు . అయితే, కేజ్రీవాల్ కస్టడీని గనుక ఈడీ గృహ నిర్బంధం కింద మార్చితే సాధ్యమవుతుందని అంటున్నారు . మరికొందరు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి పాలించేందుకు ఎలాంటి ప్రొబ్లమ్స్ ఉండవని అంటున్నారు . ఈ కేసులో దోషిగా నిరూపణ అయితేనే ఆయనపై అనర్హత వేటు పడుతుందని, కాబట్టి అంతవరకు కేజ్రీవాల్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అనర్హత నిబంధనల్ని గుర్తుకు తెస్తున్నారు. కేజ్రీవాల్ పంపిన సందేశంలో తాను జైలులో ఉన్నా, బయట ఉన్నా తన జీవితం ప్రజలకే అంకితమంటూ రాశారు . దీనిని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ సీఎంగా నిత్యం కూర్చునే కుర్చీలోనే కూర్చుని ఆ సందేశాన్ని చదివి వినిపించడంతో తదుపరి సీఎం ఆమేనన్న వార్తలు వస్తున్నాయి. కేజ్రీవాల్ భార్య సునీత మాజీ ఐఆర్ఎస్ అధికారే . కేజ్రీవాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినా కూడా సునీత మాత్రం ఉద్యోగంలోనే ఉండిపోయారు . ఆమె 2016లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అప్పట్లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయితే, ఆయన భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే . ఇప్పుడిదే విధానాన్ని ఆప్ పార్టీ అనుసరించబోతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి.