ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల అధినేతలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించబోవటం విశేషం . ఇందుకు మార్చి 27న ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు . ఈ సారి ఎన్నికలు మూడు పార్టీలు ఒకవైపు , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు అన్నట్టుగా హోరాహోరీగా సాగనున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ,ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఖరారు చేశాయి . ఇప్పుడు ఇక మిగిలింది ప్రచారమే. అందులో భాగంగా బుధవారం నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు . అయితే ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టనుండటం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ బుధవారం నుంచీ మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహించబోతున్నారు . కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకూ కొనసాగనుంది. ఈ నెల 27న ఇడుపులపాయలోని తన తాండ్ర దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వై ఎస్ జగన్, నివాళులు అర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో జగన్ ముఖాముఖీ నిర్వహించి , అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో మొదలవుతుంది . ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇక మార్చి 27 నుంచి మార్చి 31 వరకూ నారా చంద్రబాబు ప్రచారం జరగనుంది . రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్‌ సిద్ధమైనాట్లు సమాచారం . 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరిలో ప్రచారం నిర్వహిస్తారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు లో , 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో బాబు పర్యటిస్తారు. ఈ రోజు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు.