తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమే అనిపించేలా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుండగా… ఇప్పటివరకు ఒక రౌండ్ లెక్కింపు పూర్తయినట్టు తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ లో ఆశలు చిగురింపజేస్తూ తొలి రౌండ్ ముగిసేసరికి కొన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 

స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తొలి రౌండ్ అనంతరం 807 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని బీఆర్ఎస్ హైకమాండ్ కడియంకు టికెట్ ఇచ్చింది. తొలి రౌండ్ లెక్కింపులో ఫర్వాలేదనిపించిన కడియం శ్రీహరి లెక్కింపు కొనసాగేకొద్దీ తన ఆధిక్యాన్ని నిలుపుకుంటారో లేదో చూడాలి.

అటు, జహీరాబాద్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ కు తొలి రౌండ్ లో స్వల్ప ఆధిక్యం లభించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు తొలి రౌండ్ లో 4,862 ఓట్లు రాగా… కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి చంద్రశేఖర్ 4,322 ఓట్లు పొందారు. 

ఇక, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఆధిక్యం సాధించారు. తొలి రౌండ్ లో ఆయనకు 3,890 ఓట్లు లభించగా… బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కి 3,412 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ కు 1,996 ఓట్లు పడ్డాయి.