లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ ‌తన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ‌గా.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది. ఇందులో కీలకమైన మెదక్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామి రెడ్డిని ఖరారు చేశారు‌. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చింది. 

రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ 13 స్థానాలకు అభ్యర్థులను ప్ర‌క‌టించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ఖ‌రారు చేసే అవకాశం ఉంది. ఇందులో కీలకమైన నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు స్థానాల నుంచి పలువురు నేతలు టికెట్లు ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం.