ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి రజని, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీనికి సంబంధించి మంత్రి రజని, సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ముతో గెలవొచ్చని పగటి కలలు కంటున్నారని, ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో జగన్ గ్యాంగ్ టికెట్ల దుకాణానికి తెరలేపిందని అన్నారు. ఓవైపు ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తూ, మరోవైపు అభ్యర్థులను డబ్బులు గుంజుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టికెట్ల అమ్మకాల్లో సజ్జల సీఎం జగన్ కు బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని, టికెట్ల అమ్మకాలతో ఇప్పటివరకు రూ.1000 కోట్లను సజ్జల తాడేపల్లి ప్యాలెస్ కు పంపించారని ఆరోపించారు.