కరోనా కష్టసమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులతో జగన్ రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు కనీసం మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు కూడా ఇవ్వని జగన్ రెడ్డి కుళ్లిన సర్కారును రానున్న ఎన్నికల్లో పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చి చెత్తకుప్పలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. గత పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన రక్షణ పరికరాలేవీ జగన్ రెడ్డి ఇవ్వడం లేదని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. 

“స్కానింగ్ మెషీన్లు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెంచారు. రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కొత్త వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పనిభారాన్ని మోపి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. పనికి తగిన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న జగన్ సర్కారు కార్మికుల ఆగ్రహజ్వాలల్లో కాలిపోక తప్పదు. మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ లో చేర్చి వారికి వేతనాలు మాత్రం నామమాత్రంగా ఇస్తూ అన్యాయం చేస్తున్నారు.