పెడనలో జనసేన నిర్వహించబోతున్న సభలో గూండాలు, క్రిమినల్స్ ద్వారా రాళ్లదాడి, గొడవలు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వం పక్కాప్లాన్ వేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో పవన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ… తమ నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని చెప్పారు. పెడనలోని తోటమూల సెంటర్ లో బహిరంగసభకు పవన్ అనుమతి కోసం పవన్ దరఖాస్తు చేసుకున్నారని, ఆయన సభకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.