అక్టోబర్ 16న వరంగల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని ప్రకటిస్తారని, ఆ మ్యానిఫెస్టో వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మక్తల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… రైతు బంధు, పెన్షన్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ రోజు ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. బీఆర్ఎస్ కొత్త మ్యానిఫెస్టో తయారవుతోందని, ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో అన్ని పథకాలను రెండింతలు చేశారని, ఇప్పుడు కేసీఆర్ మరేం శుభవార్త చెబుతారో.. సిద్ధంగా ఉండాలన్నారు. కేసీఆర్‌ది మాట అంటే మాటే అన్నారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని హరీశ్ రావు అన్నారు. కోస్గిలో 150 పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహిళలు మరింత బలోపేతమయ్యేలా కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.