ఖరీఫ్ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. దీంతో రైతులు తమ పంట చేనులను, పొలాల దుక్కులు దున్ని సిద్ధం చేస్తున్నారు. పంటలు సాగు అంచనా మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా పండించే పత్తి, వరి, మిర్చి విత్తనాలు కోసం రైతులు వెంపర్లాడుతున్నారు.
![karimnagar cp chhecking seeds company](https://i0.wp.com/tolivelugu.com/wp-content/uploads/2023/05/karimnagar-cp-chhecking-seeds-company.jpg?resize=886%2C587&ssl=1)
అయితే కొన్ని కంపెనీల విత్తనాలు కొన్ని దుకాణాలకు మాత్రమే స్టాక్ వచ్చింది. పూర్తి స్థాయిలో పత్తి, వరి విత్తనాలు దుకాణాలలోకి అందుబాటులోకి రాలేదు. మారుమూల ప్రాంతాలలో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మార్కెట్ ను నకిలీ విత్తనాలు ముంచెత్తే అవకాశం ఉంది. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విత్తనాలు , ఎరువుల అమ్మకాల పట్ల నిఘా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.