పేదల సంక్షేమం కోసం దివంగత ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. వీరిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చామని చెప్పారు. ఒక పరమార్థం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారని, వారికి మరణం ఉండదని… అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆయన జీవన విధానమే భగవంతుడి మార్గమని అన్నారు. అన్ని వర్గాలకు ఆయన దేవుడని తెలిపారు. ఆయన రగిలే ఒక అగ్నికణమని చెప్పారు. మహనీయమైన జన్మను పొందిన ఎన్టీఆర్ కు మరణం లేదని బాలయ్య అన్నారు. నటుడిగా అనితరసాధ్యమైన ఎన్నో పాత్రలను పోషించారని చెప్పారు. అలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడని అన్నారు. సినిమాలే కాకుండా, టీడీపీని స్థాపించి, ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయాలంటే ఏమిటో నేర్పిన నాయకుడని కొనియాడారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఒక అవగాహన కల్పించారని చెప్పారు.