స్కిల్ కేసులో తన అరెస్టు అక్రమమంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. న్యాయమూర్తులు ఇద్దరూ వేర్వేరుగా తీర్పు వెలువరించారు. ముందుగా తీర్పు వెల్లడించిన జస్టిస్ బోస్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, జస్టిస్ బేలా ఎం. త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ద్విసభ్య ధర్మాసనం విజ్ఞప్తి చేసింది.

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సెప్టెంబర్ 9న అధికారులు అరెస్టు చేశారు. మెడికల్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చిన చంద్రబాబు.. తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందారు. అయితే, తన అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు నిబంధనలు పాటించలేదని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.