కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకొని, వాటి ఆధారంగా రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసిన్టటు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని భట్టి యాత్రకు మంచి స్పందన వస్తోందని తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పైన భట్టి ఎక్కువగా దృష్టి పెట్టారని, వాటి పైన స్పందిస్తున్న తీరుతో ప్రజల నుంచి పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందినట్టు తెలుస్తోంది. దాంతో, భట్టి ప్రజలతో మమేకం అవుతున్న తీరును రాహుల్ అభినందించినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ నాయకత్వం ఆయనకు తోడుగా నిలుస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ హాజరు కానున్నారు.