బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మహారాష్ట్ర షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు, ఎమ్మెల్యే నితీశ్ రాణేపై కూడా కేసు పెట్టారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారంటూ వారిపై అభియోగాలు మోపారు. 

కేసు వివరాల్లోకి వెళ్తే… గత శనివారం షోలాపూర్ లోని రాజేంద్ర చౌక్ నుంచి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజాసింగ్, నితీశ్ రాణేలతో పాలు హిందూ సమాజ్ నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ వారిపై జైల్ రోడ్డు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి. దీంతో, వీరిపై ఐపీసీ 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.