కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అధిష్ఠానం పెద్దలతో చర్చలు, ప్రమాణస్వీకారానికి ఆహ్వానాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్య విమానాశ్రయంలో ఆయనను కలిశారు. 

రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. అధిష్ఠానం పెద్దలతో కీలకమైన చర్చలు జరిపారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అగ్రనేతలను స్వయంగా ఆహ్వానించారు. నిజానికి బుధవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకోవాల్సింది. కానీ బయలుదేరి విమానాశ్రయం దాకా వచ్చిన తర్వాత పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే నుంచి పిలుపు రావడంతో వెనుదిరిగి వెళ్లారు. ఠాక్రేతో ముఖ్యమైన అంశాలపై చర్చించాక హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. రేవంత్‌రెడ్డి వెంట సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, బలరామ్‌ నాయక్‌ సహా పలువురు ఉన్నారు. కాగా ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.