ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం 4 ప్లస్ 4 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాల్లో ప్రవేశించగా, ఇక్కడి ప్రభుత్వం దాన్ని 1 ప్లస్ 1 కు తగ్గించింది. దాంతో షర్మిల తనకు భద్రత పెంచాలని కోరుతూ ఈ నెల 22న రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. 

ఈ నేపథ్యంలో షర్మిలకు భద్రత తగ్గించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ గ్రూప్ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాల కోసం షర్మిల రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని, కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని రఘువీరా, సుంకర పద్మశ్రీ వివరించారు.