కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుధవారం బుక్ లెట్‌ను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇష్టారీతిన ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించింది. అందుకే హామీల అమలును ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటకు కట్టుబడి లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రం ప్రతులను ఈ సందర్భంగా పార్టీ నేతలకు అందించింది. కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. హామీల అమలులో ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తోంది.