న్యూ ఢిల్లీ :మార్చి 18
దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది.
‘‘ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్‌ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ. 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం’’ అని  పేర్కొంది. కేసులో ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ.. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.