తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన నేతలతో రిబ్బన్ కటింగ్ లు చేయిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

ప్రజాపాలన పేరుతో నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ తప్పుతున్నారని వ్యాఖ్యానించారు. కొమరవెల్లి ఉత్సవాల సమీక్ష సందర్భంగా ఓడిపోయిన నేతను కలెక్టర్ పక్కన కూర్చోబెట్టుకోవడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. నర్సాపూర్ లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాదని ఓడిపోయిన నేతనే ‘అభయహస్తం’ దరఖాస్తులు పంచుతున్నారని ఆరోపించారు. 

ఇక, ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, కోడ్ అమల్లోకి వస్తే ఆరు గ్యారెంటీల అమలు సందేహాస్పదం కానుందని అన్నారు. 

అలాకాకుండా, గ్యారెంటీలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉందని హరీశ్ రావు సూచించారు. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ సర్కారు ఏం చేసినా ఫిబ్రవరి 20 లోపే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.