భారతదేశ కుబేరుడు, రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ కార్యక్రమం సందర్భంగా ఇది చోటు చేసుకుంది. దీన్ని ప్రధాని మోదీ  ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ  ప్రధానిని అభినందించారు. ‘‘ప్రతి తరానికి ఓ విజన్ అంటూ ఉండాలి. ఆ విజన్ ఎన్నింటికో ప్రోత్సాహంగా నిలవాలి. మీరు (ప్రధాని మోదీ) మా తరానికి మన దేశాన్ని వికసిత భారత్ గా మార్చాలనే దృక్పధాన్ని కల్పించారు’’ అని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దేశంలో తొలి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్ ‘జియో స్పేస్ ఫైబర్’ను విడుదల చేసింది. ఇది అధిక వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందించేందుకు వీలు కల్పిస్తుంది. దేశీయంగా రిలయన్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ, ఉత్పత్తులను ప్రధాని మోదీకి ఆకాశ్ అంబానీ వివరించారు. జియో స్పేస్ ఫైబర్ ద్వారా కొత్తగా లక్షలాది మందికి చేరువ అవుతామని ఆకాశ్ అంబానీ ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ 100 5జీ ల్యాబ్ లను ప్రారంభించారు. 

Previous articleచంద్రబాబు అరెస్టు సమయంలో అధికారుల కాల్ డేటా ఇవ్వాలని టీడీపీ పిటిషన్
Next article వెడ్డింగ్ బెల్స్.. ఇటలీకి పయనమైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి