ఎన్నికల నియమావళి కేసులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట కలిగింది. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు నేడు కొట్టివేసింది. అప్పట్లో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ చిరంజీవిపై కేసు నమోదైంది. నిర్ణీత సమయం దాటి సభను నిర్వహించారంటూ చిరంజీవిపై అభియోగాలు మోపారు. ఆ సభ వల్ల ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని కేసు నమోదు చేశారు. తొమ్మిదేళ్ల నాటి ఈ కేసుపై చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్ నేతగా ఉన్న సంగతి తెలిసిందే.